న్యూఢిల్లీ, జనవరి 23 : ఐపీఎల్ -11 సీజన్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా ఈ మెగా టోర్నీ మ్యాచ్ సమయాల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. ఇంతకు ముందు 10 సీజన్లలో రెండు మ్యాచ్ లలో మొదటి మ్యాచ్ 4 గంటలకు, రెండో పోరు రాత్రి 8.00 గంటలకు జరిగేవి. దీని వల్ల స్టేడియం నుండి ప్రేక్షకులు ఇంటికి వెళ్లడానికి ఎక్కువ సమయం పట్టేది. అంతే కాకుండా టీవీల్లో అర్ధరాత్రి దాకా మ్యాచ్లు చూడటమూ ఇబ్బందిగా ఉండేది. దీనిని దృష్టిలో పెట్టుకొని ఐపీఎల్ పాలక మండలి వచ్చే సీజన్ నుంచి సాయంత్రం 5.30కి మొదటి మ్యాచ్ ను, రాత్రి పోరు 7 గంటలకు ప్రారంభమయ్యేలా షెడ్యూల్ ను సవరించింది. ఐపీఎల్ 11వ సీజన్ ఏప్రిల్ 7 నుండి మే 27 వరకు జరగనుంది. ఈ సీజన్ కోసం బెంగళూరులో ఈ నెల 27, 28 తేదీల్లో ఆటగాళ్ల వేలం జరగనున్న విషయం తెలిసిందే. ఈ వేలంలో 578 క్రీడాకారులు పాల్గొననున్నారు.