న్యూఢిల్లీ, జనవరి 22 : ఆప్కు చెందిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడటంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన ఈ సందర్భంగా మాట్లాడారు. "దేవుడు చేసిన అద్భుతమే ఇదంతా. ఆయనకు అంతా తెలుసు. అందుకేనేమో 70 అసెంబ్లీ స్థానాలకు, 67 స్థానాల్లో ఆప్ గెలుపొందే విధంగా చేశాడు. మాపై కుట్రలు పన్ని అక్రమ కేసులు బనాయించారు. అంతేకాకుండా సీబీఐ దాడులు కూడా చేయించారు. చివరికి మా వద్ద ఏమి లభ్యం కాకపోవడంతో ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించారు" అని పేర్కొన్నారు. కాగా ఆ ఎమ్మెల్యేలంతా లాభదాయక పదవులు చేపట్టినందుకు గాను వారిని అనర్హులుగా ప్రకటించారు.