అమరావతి, జనవరి 22 : ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డిని సీబీఐ పోలీసులు అరెస్ట్ చేశారు. తప్పుడు ధృవపత్రాలతో ఐఎఫ్సీఐ(భారతీయ పారిశ్రామిక ఆర్థిక సంస్థ) సుమారు రూ.205.02 కోట్ల మొత్తం అక్రమాలకు పాల్పడ్డట్టు సీబీఐ విచారణలో తేలింది. బెంగళూరు సీబీఐ అధికారుల నుంచి నారాయణరెడ్డికి పిలుపు రావడంతో హుటాహుటీన బయలుదేరి వెళ్లారు. అక్కడే విచారణ అనంతరం ఆయనను అరెస్టు చేశారు. గతేడాది ఏప్రిల్లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా గెలుపొందారు. ఆ తర్వాత కొద్ది రోజులకే సీబీఐ విచారణ ఎదుర్కోవలసి వచ్చింది. ఆ తర్వాత ఆయన్ను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న ఆయన ప్రభుత్వ కార్యక్రమాలకు మాత్రం ఎమ్మెల్సీ హోదాలోనే హాజరయ్యేవారు.