లక్నో, జూన్ 22: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ లక్నో లో ఇచ్చిన విందుకు సమాజవాది పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ అందరికన్నా ముందుగా హాజరు అవడం చర్చనీయాంశంగా మారింది. మోదీ లక్నో లో ఒక వంద మంది ప్రముఖులకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ నివాసంలో విందు ఇచ్చారు. ఈ విందుకు ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, మరో మాజీ సీఎం మాయావతి లను కూడా ఆహ్వానించినా వారిద్దరు హాజరు కాలేదు. రాష్ట్రపతి ఎన్నిక నేపధ్యంలో ఈ విందు జరిగిందని నేతలు భావిస్తున్నారు. అయితే అఖిలేష్ రాకపోయినా, ఆహ్వానితులలో ఒకరైన మూలాయం మాత్రం రాష్ట్ర గవర్నర్ రామ్ నాయక్ కన్నా ముందుగానే హాజరు అవడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. కుమారుడు అఖిలేష్ తో ఏర్పడిన వివాదం కొనసాగుతున్న విషయం దీనితో స్పష్టమైందని పలువురు నేతలు అభిప్రాయపడుతున్నారు. కాగా రాష్ట్రపతి ఎన్నికలో ఎవరికి మద్దతు ఇవ్వాలన్న అంశంపై అఖిలేష్ మాత్రం విపక్షాల సమావేశం తర్వాత నిర్ణయిస్తామన్నారు. మాయావతి మాత్రం విందుకు హాజరు కాకపోయినా బిజెపి అభ్యర్ది రామ్ నాద్ కోవింద్ కు వ్యతిరేకత తెలపలేదని సమాచారం.