హైదరాబాద్, జనవరి 21 : మేడారం జాతరకు టీఎస్ఆర్టీసీ ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసింది. జాతరకు వెళ్ళే భక్తుల కోసం ప్రత్యేక బస్సులను నడిపేందుకు సన్నాహాలు చేస్తోంది. సుమారు 690 బస్సులను నడపనున్నట్లు రంగారెడ్డి జిల్లా రీజినల్ మేనేజర్ యాదగిరి తెలిపారు. జూబ్లీ బస్స్టేషన్, ఎంజీబీఎస్, దిల్సుఖ్నగర్, జగద్గిరిగుట్ట, నేరేడ్మెట్, కేపీహెచ్బీ, లింగంపల్లి తదితర బస్ స్టాండ్ ల నుంచి బయలుదేరి ఉప్పల్లోని వరంగల్ పాయింట్ మీదుగా ఈ బస్సులు నడవనున్నాయి. ఈ సర్వీసులు ఈనెల 27 నుంచి ఫిబ్రవరి 3వ తేదీ వరకు అందుబాటులో ఉండనున్నాయి. అంతేకాకుండా ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రతీ పాయింట్లో డిపో మేనేజర్/ట్రాఫిక్ సూపర్వైజర్ అధికారులు, సెక్యూరిటీ సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉంటారని రీజినల్ మేనేజర్ తెలిపారు. ఈ-టికెట్ను www.tsrtconline.in ద్వారా కూడా రిజర్వేషన్ చేసుకోవచ్చని అన్నారు. మేడారం జాతర బస్సులకు సంబంధించిన వివరాలు, రూట్ మ్యాప్ను ఆవిష్కరించారు.