జయశంకర్, జనవరి 21 : "కేసీఆర్ ఇకనుంచి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు కాదు కాళేశ్వరం చంద్రశేఖర్రావు" అని గవర్నరు నరసింహన్ వ్యాఖ్యానించారు. కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనలో భాగంగా మేడిగడ్డ నుంచి ప్యాకేజీ-8లోని లక్ష్మీపూర్ వరకు బ్యారేజీలు.. పంపుహౌస్లు.. సహా ఇతర పనులపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. రెండేళ్ళ క్రితం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు ఇదంతా జరిగే పనేనా అని అనుకున్నట్లు తెలిపారు. కాని భారీ ప్రాజెక్టును వేగంగా నడిపిస్తున్న కేసీఆర్ను ఇకనుంచి కాళేశ్వరం చంద్రశేఖర్రావుగా పిలుస్తానన్నారు. * అర్దరాత్రి మంత్రి హరీష్ రావు పర్యటన.. తెలంగాణ రాష్ట్ర భారీనీటిపారుదలశాఖ మంత్రి హరీశ్రావు అర్థరాత్రి కాళేశ్వరం ప్రాజెక్ట్ పనులను పరిశీలించారు. కాళేశ్వరం ప్రాజెక్టు 6,7, 8 ప్యాకేజీ పనులను సహా నందిమేడారం వద్ద 6,7 ప్యాకేజీ పనులు అదేవిధంగా కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలో 8వ ప్యాకేజీ పనులపై ఆరా తీశారు. ఈ మేరకు అర్దరాత్రి సమీక్ష నిర్వహించిన మంత్రి 7 వ ప్యాకేజీలో ఇటీవల కుంగిన చెరువు కట్టను పరిశీలించారు. పనులలో వేగం పెంచాలని, జూన్ నాటి కల్లా అన్ని పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.