న్యూఢిల్లీ, జనవరి 20 : గణతంత్ర దినోత్సవ వేడుకలకు సర్వం సిద్దమైంది. ఈ సంవత్సరం వేడుకలకు ఆసియా దేశాధినేతలు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో రికార్డు స్థాయిలో వేదికను రూపొందిస్తున్నారు. పది దేశాధినేతలు ఒకే వేదికపై ఆసీనులయ్యేందుకు వీలుగా దాదాపు 100 అడుగుల పొడవైన బుల్లెట్ ప్రూఫ్ వేదికను అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఈ వేడుకలకు విచ్చేయనున్న అతిథుల కోసం తాజ్ ప్యాలెస్, తాజ్ మన్సింగ్, మౌర్య షెర్టాన్, లీలా ప్యాలెస్, ఒబెరాయ్ హోటళ్లలో బస ఏర్పాటు చేసినట్లు సమాచారం. గణతంత్ర వేడుకలను పురస్కరించుకొని జనవరి 18 నుంచి 26 వరకు ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉదయం 10.15గం. నుండి మధ్యాహ్నం 12.35 వరకు ఎటువంటి విమాన సేవలు ఉండబోవని అధికారులు స్పష్టం చేశారు.