మూన్నెళ్ళకే ముగిసిన మూడు ముళ్ల బంధం...

SMTV Desk 2018-01-20 13:10:50  gangavaram, east godavari district,

గంగవరం, జనవరి 20: మూడు నెలలు కాకుండానే మూడు ముళ్ల బంధం ముగిసిపోవడం అందరినీ కబళించింది. భర్త కళ్లెదుటే భార్య మరణించిన విషాద సంఘటన గంగవరం మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. కల్లుపల్లెవాసి శ్రీహరికి, కలగటూరు పంచాయతీ మిట్టిండ్లుకి చెందిన రోజా (22)కు మూడు నెలల క్రితం వివాహమైంది. శుక్రవారం ఉదయం పొలం వద్ద ఉన్న వరి గడ్డిని ఇంటికి తరలించేందుకు వీరిద్దరూ ట్రాక్టర్‌లో బయలుదేరారు. చినమామ కృష్ణమూర్తి ట్రాక్టర్‌ నడపగా వెనుక చెక్కలపై భర్త శ్రీహరి, భార్య రోజా కూర్చున్నారు. మిట్టపల్లాలు ఉన్న పొలాల మధ్య వాహనం వెళ్తుండగా పట్టు తప్పిన రోజా ట్రాక్టర్‌కు, ట్రాలీకి మధ్య కిందకు జారి పడిపోయింది. ఆ ట్రాలీ చక్రాలు ఆమెపై నుండి వెళ్లటంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు, బంధువులు సంఘటన స్థలం వద్దకు చేరుకుని బోరున విలపించారు. వారి రోదనలతో అక్కడి ప్రాంతమంతా విషాదం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకుని మృతదేహాన్ని పంచనామా నిమిత్తం పలమనేరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.