యాసిడ్ దాడి బాధితులకు రిజర్వేషన్లు: మోదీ

SMTV Desk 2017-06-22 12:43:10  narendra modi, government, Acid attac , Victimsk,Supreme Court

న్యూ ఢిల్లీ, జూన్ 22 : నరేంద్ర మోదీ సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో మహిళలపై జరుగుతున్న యాసిడ్ దాడులపై స్పందించిన ప్రభుత్వం, యాసిడ్ దాడి లో గాయపడిన బాధితులకు ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించారు. ఈ మేరకు డీఓపీటీ (డిపార్ట్ మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్) ముసాయిదా ప్రతిపాదనలను తయారుచేసి క్యాబినెట్ అనుమతి నిమిత్తం పంపింది. ఉద్యోగాల్లో ఖాళీలు, ప్రమోషన్ల కోటా, వయోపరిమితి సడలింపు తదితరాంశాలను ముసాయిదాలో ప్రతిపాదించారు. కాగా ఈ ప్రతిపాదనలకు న్యాయ పరమైన అడ్డంకులు ఎదురు కావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే వికలాంగులకు ప్రమోషన్ల, రిజర్వేషన్ల అంశాలపై సుప్రీంకోర్టు విచారణలో ఉన్నందున, ఈ ముసాయిదాపైన కొందరు కోర్టును ఆశ్రయించే అవకాశాలు ఉన్నాయన్నారు. ప్రత్యక్ష నియామకాలు జరిపే విభాగాల్లో నాలుగు శాతం ఖాళీలను యాసిడ్ దాడి బాధితులకు, దివ్యాంగులకు కేటాయించాలని డీఓపీటీ ప్రతిపాదించింది. అంధత్వం, పాక్షిక అంధత్వం, బదిరత్వం, పాక్షిక బదిరత్వం తదితరాలతో బాధపడుతున్న వారికి ఈ ఉద్యోగాలు ఇవ్వాలని పేర్కొన్నారు. దీనిపై రానున్న 15 రోజుల్లోగా అన్ని ప్రభుత్వ విభాగాలు సలహా, సూచనలు ఇవ్వాలని మోదీ తెలిపారు.