ముంబయి, జనవరి 17: బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ సెన్సెక్స్ అరుదైన మైలురాయిని తాకింది. మంగళవారం నాటి ట్రేడింగ్లో మార్కెట్ చరిత్రలో తొలిసారిగా 35వేల మార్క్ను చేరుకొని రికార్డు నమోదు చేసింది. ఐటీ, బ్యాంకింగ్ రంగాల షేర్ల అండతో నేడు లాభాల్లో పరుగులు తీస్తున్న సూచీలు సంచలనాల దిశగా సాగుతున్నాయి. ఆరంభం నుంచే దూకుడుగా ఉన్న సూచీలు మధ్యాహ్నం సమయంలో సరికొత్త రికార్డులను సృష్టిస్తూ మార్కెట్ అంచనాలను పెంచుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 255 పాయింట్ల లాభంతో 35,026 వద్ద, నిఫ్టీ కూడా 70 పాయింట్ల లాభంతో 10,771 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, యాక్సిస్ బ్యాంక్, టీసీఎస్ తదితర షేర్లు లాభాల్లో దూసుకెళ్తున్నాయి. ఇటీవల వెలువడిన ఐటీ కంపెనీల సానుకూల త్రైమాసిక ఫలితాలతో పాటు రేపు జరగబోయే జీఎస్టీ సమావేశంపై ఆశాజనకంగా ఉన్న మదుపర్లు పెట్టుబడుల బాట పట్టినట్లు మార్కెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు.