అహ్మదాబాద్, జనవరి 17: విశ్వహిందూ పరిషత్(వీహెచ్పీ) అంతర్జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా, తనను హత్యచేసే౦దుకు కొందరు కుట్ర పన్నారని సంచలన ఆరోపణలు చేశారు. రామమందిరం, గోవధ వంటి అంశాలపై మాట్లాడకుండా తనగొంతు నొక్కుతున్నారంటూ కన్నీటి పర్యంతమయ్యారు. తనను ఎన్కౌంటర్ చేసి చంపేందుకు రాజస్థాన్ పోలీసులు వచ్చారంటూ సోమవారం సందేశాలు వచ్చాయని తెలిపారు. దీంతో రాజస్థాన్లోని గంగాపుత్లోగల న్యాయస్థానం ఎదుట హాజరయ్యేందుకుగాను అహ్మదాబాద్ విమానాశ్రయానికి వెళ్తుండగా దారిలోనే స్మృహ కోల్పోయానని మీడియాకు తెలిపారు. స్మృహలోకి వచ్చేసరికి ఆస్పత్రిలో ఉన్నట్లు పేర్కొన్నారు. తనపై కుట్రలు పన్నుతున్నవారి పేర్లను సరైన సమయంలో బయటపెడతానన్నారు. పదేళ్లక్రితం నాటి ఓ కేసులో తొగాడియాను అరెస్టు చేసేందుకు రాజస్థాన్ పోలీసులు సోమవారం అహ్మదాబాద్ వెళ్లగా.. ఆయన తన నివాసంలో కనిపించలేదు. దీంతో ఆయన అదృశ్యంపై కలకలం రేగింది. అనంతరం షాహిబాగ్ ప్రాంతంలోని ఓ ఆస్పత్రిలో తొగాడియా కనిపించారు. కాగా ఈ అంశంపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని గుజరాత్ రాష్ట్ర కాంగ్రెస్ డిమాండ్ చేసింది.