సిడ్నీ, జనవరి 12: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ తనయుడు అర్జున్ టెండుల్కర్ గురించి ఆసీస్ మీడియా ప్రశంసల వర్షం కురిపించింది. ప్రస్తుతం అర్జున్ ఆస్ట్రేలియాలోని సిడ్నీ క్రికెట్ మైదానం ఆధ్వర్యంలో జరుగుతోన్న గ్లోబల్ టీ20 లీగ్లో ఆడుతున్నాడు. లీగ్లో భాగంగా బ్రాడ్మన్ ఓవల్ గ్రౌండ్లో జరిగిన మ్యాచ్ లో అర్జున్ తన ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టాడు. 4 ఓవర్లలో నాలుగు వికెట్లు తీయడంతోపాటు 27 బంతుల్లో 48 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. అర్జున్ ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ... "దిగ్గజ ఆటగాడు బ్రాడ్మన్ పేరిట ఉన్న ఓవల్ మైదానంలో ఆడటం చాలా ఆనందంగా ఉంది. చిన్నప్పటి నుంచి నాకు ఫాస్ట్ బౌలింగ్ అంటే ఇష్టం. మిచెల్ స్టార్క్, బెన్ స్టోక్స్ నా అభిమాన ఆటగాళ్లు. భయం లేకుండా ఆడు. నీ జట్టు కోసం ఆడు. ఆటగాడిగా నువ్వు జట్టుకు ఎంత సాయం చేయగలవో అంతవరకు చేయ్యి అని నా తండ్రి ఎప్పుడూ చెప్తుంటారు. బౌలింగ్ చేస్తున్నంత సేపు.. బ్యాట్స్మెన్ పరుగులు సాధించకుండా బంతులేయాలి అని, బ్యాటింగ్ చేస్తున్న సమయంలో వీలైనన్ని ఎక్కువ పరుగులు చేయాలి. వీటి గురించే ఆలోచిస్తా" అని అర్జున్ పేర్కొన్నాడు.