హైదరాబాద్, జనవరి 12: పీబీఎల్-3 చివరి లీగ్ మ్యాచ్లో ఆతిథ్య హైదరాబాద్ హంటర్స్ చేతిలో బెంగళూరు బ్లాస్టర్స్ ఘోర పరాజయం చవిచూసింది. గురువారం గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన పోరులో హంటర్స్ బ్లాస్టర్స్ను చిత్తుచేసింది. తొలి మ్యాచ్లో బెర్నాడెత్- సాత్విక్ సాయిరాజు 15-6, 14-15, 15-9తో సిక్కిరెడ్డి- మనుపై విజయం సాధించారు. పురుషుల సింగిల్స్లో సాయిప్రణీత్ 10-15, 15-7, 15-14తో చాంగ్ ఫెంగ్పై గెలుపొందాడు. మహిళల సింగిల్స్లో హంటర్స్ సారథి కరోలినా మారిన్ 15-9, 15-7తో గిల్మూర్పై గెలిచి జట్టుకు 3-0తో ఆధిక్యం అందించింది. హంటర్స్ ట్రంప్ మ్యాచ్గా ఎంచుకున్న రెండో పురుషుల సింగిల్స్లో లీ హ్యున్ 15-11, 11-15, 15-11తో శుభంకర్ దేవ్పై నెగ్గాడు. బ్లాస్టర్స్ ట్రంప్ మ్యాచ్ పురుషుల డబుల్స్లో మార్కిస్ కిడొ- యియాన్ సియాంగ్ 15-10, 11-15, 15-7తో మథియస్- కిమ్ రాంగ్ గెలిచారు.. దీ౦తో హంటర్స్ ఆధిక్యం 5-0కు పెరిగింది. లీగ్ దశ అనంతరం పాయింట్ల పట్టికలో హంటర్స్ (20), అహ్మదాబాద్ స్మాష్ మాస్టర్స్ (17), దిల్లీ డాషర్స్ (15), బ్లాస్టర్స్ (14) తొలి 4 స్థానాల్లో నిలిచి సెమీస్ బెర్తు దక్కించుకున్నాయి. శుక్రవారం తొలి సెమీస్లో హైదరాబాద్ హంటర్స్.. దిల్లీ డాషర్స్తో, శనివారం రెండో సెమీస్లో అహ్మదాబాద్ స్మాష్ మాస్టర్స్.. బెంగళూరు బ్లాస్టర్స్తో పోటీపడనున్నాయి.