న్యూయార్క్, జూన్ 21 : అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీజే)లో న్యాయమూర్తి పదవి చేపట్టడం అనేది చాలా మహోన్నతమమైన విషయం. అలాంటి పదవిని రెండోసారి కూడా ఇవ్వడం అనేది, ఒక వ్యక్తిపై ఆ దేశం ఎంత నమ్మకాన్ని పెంపొందించుకుందోనని అంచనా వేయవచ్చు. ఐసీజే న్యాయమూర్తి పదవికి భారతదేశం అభ్యర్థిగా మరోసారి జస్టిస్ దల్వీర్ భండారీ(69)ని ప్రభుత్వం ప్రకటించింది. ఆయన తొలిసారిగా 2012లో ఐసీజే న్యాయమూర్తి పదవికి ఎన్నికయ్యారు. 2018 ఫిబ్రవరి లో ఆయన పదవి కాలం ముగుస్తుండడంతో, 2017 నవంబర్ లోనే ఎన్నికలు నిర్వహించాలని ఐసీజే నిర్ణయం తీసుకుంది. ఈ తరుణంలో జూలై 3 లోగా నామినేషన్లు వేయాల్సి ఉండగా భారత్ తరుపున జస్టిస్ భండారి పేరును కేంద్ర ప్రభుత్వం ఖరారు చేసింది. ఐసీజేలో జడ్జిగా ఇప్పటివరకు భండారీ తనదైన ముద్రను వేసుకున్నారు. వివిధ దేశాల మధ్య సముద్ర వివాదాలు, అంటార్కిటికాలో తిమింగలాల వేట, మారణకాండ, అణునిరాయుధీకరణ, ఉగ్రవాదానికి ఆర్ధిక సహాయం, సార్వభౌమ హక్కుల ఉల్లంఘన వంటి ముఖ్యమైన కేసుల తీర్పుల్లో తన అభిప్రాయాలను వెల్లడించారు. అలాంటి దేశాభివృద్ధి నిర్ణయాలను మరెన్నో తీసుకుంటారని ఆశిస్తూ ఆయనకు మరో సారి అవకాశం కల్పించామని అధికారులు తెలిపారు.