హైదరాబాద్, జనవరి 12 : కష్టాల్లో ఉన్న పారిశ్రామికవేత్తలను ఆదుకోవాలని, బకాయిలను సకాలంలో చెల్లించకపోతే నేరుగా నిరర్ధక ఆస్తులుగా ప్రకటించి, జప్తులకు వెళ్లకుండా.. అసలు వీరికి ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో తెలుసుకొని అందుకనుగుణంగా వ్యవహరించాలని రాష్ట్ర ఐటీశాఖల మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. ఎస్బీఐ ప్రధాన కార్యాలయంలో పరిశ్రమల రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి సమావేశంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలను ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం వినూత్న కార్యక్రమాలతో పురోగమిస్తోంది. మూతపడ్డ పరిశ్రమల పునరుద్ధరణకు దేశంలోనే తొలిసారిగా పారిశ్రామిక చికిత్స కేంద్రాలు (హెల్త్ క్లీనిక్)లు నెలకొల్పాం. ఖాయిలా పరిశ్రమలకు అప్పులను పునరుద్ధరించి, తమ రుణాలను బ్యాంకులు వసూలు చేసుకోవాలి" అంటూ పేర్కొన్నారు. అంతేకాకుండా ఆయన పునరుద్దరణకు సంబంధించిన విషయంపై మాట్లాడారు. > ముద్ర, ప్రధానమంత్రి ఉపాధి హామీ పథకం కార్యక్రమాల్లోనూ వంద శాతం లక్ష్యాలను చేరుకునేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలి. > సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలకు సకాలంలో రుణాలివ్వాలి. > స్వయం ఉపాధికి ముందుకొస్తున్న మహిళలను ప్రోత్సహించాలి. > ఆహారశుద్ధి, తోలు తదితర వృత్తి ఆధార పరిశ్రమలకు బ్యాంకులు భారీఎత్తున సాయం చేయాలి.