ఇస్లామాబాద్, జనవరి 11 : ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారం చేసి అతి దారుణంగా హత్య చేసిన ఘటనపై పాకిస్తాన్ దేశ యాంకర్ వినూత్న రీతిలో నిరసన తెలిపారు. తన కూతురిని పక్కన కూర్చొబెట్టుకొని వార్తలు చదివారు. ఈ నెల 4 వ తేదీన జైనాబ్(8) అనే బాలిక అపహరణకు గురైంది. దాదాపు ఐదు రోజుల తర్వాత ఆ చిన్నారి మృతదేహం ఓ చెత్తకుప్పలో దొరికింది. సౌది అరేబియాలో ఉన్న ఆ బాలిక తల్లిదండ్రులు పాకిస్తాన్ కు వచ్చి నిందితులను అరెస్ట్ చేసే వరకు మృతదేహాన్ని ఖననం చేయబోమని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఆ దేశ యాంకర్ కిరణ్ నాజ్ "నేను ఇప్పుడు కిరణ్ నాజ్ ను కాదు. ఒక సామాన్యమైన తల్లిని. అందుకే నా కూతురిని పక్కన కూర్చోబెట్టుకున్నా" అని పేర్కొన్నారు. చిన్నారి జైనాబ్ ను అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనపై ఆమె అతనా ఆవేదన, ఆక్రోశాన్ని వెళ్లగక్కారు. "ఇప్పుడు నాకు ఆ చిన్నారి గురించి తప్ప మాట్లాడడానికి ఏమి లేదు. ఆ నిందితులను పట్టుకోవడంలో ప్రభుత్వం విఫలం కావడంపై నేను ఒక తల్లిగా బాధపడుతున్నా" అంటూ భావోద్వేగానికి లోనయ్యారు.