లఖ్నవూ, జనవరి 11: సరదాగా విందు బోజనానికి వెళ్లి 9 మంది మృత్యువాత పడ్డారు. ఈ విషాదకరమైన ఘటన ఉత్తర్ప్రదేశ్లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. లఖ్నవూలోని థాల్ ఖుర్ద్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తన బంధువులను ఇంటికి భోజనానికి ఆహ్వానించాడు. దాదాపు తొమ్మిది మంది అతడి ఇంటికొచ్చారు. అందరూ సరదాగా కూర్చుని విందు ఆరగించారు. అనంతరం వారు క్రమంగా అస్వస్థతకు గురై మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. భోజనానికి పిలిచిన వ్యక్తే విషం పెట్టి చంపాడా? లేదా వారి ఆరోగ్య పరిస్థితుల వల్ల చనిపోయారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.