బీజింగ్, జూన్ 20 : ఉగ్రవాద నిర్మూలన ఒప్పందానికి ఐరాసలో ఆమోదం పొందేలా భారత్, తాను కొనసాగిస్తున్న ప్రయత్నాలకు మద్దతివ్వాలని ‘బ్రిక్స్’ కూటమి దేశాలకు విజ్ఞప్తి చేసింది. ‘ మరోవైపు ఈ ముప్పును ఎదుర్కోవడంలో కూటమి మధ్య ఏకాభిప్రాయం వ్యక్తమైంది. బ్రెజిల్, రష్యా, చైనా, భారత్, దక్షిణాఫ్రికాతో కూడిన ‘బ్రిక్స్’ కూటమి విదేశాంగ మంత్రుల సమావేశం సోమవారం బీజింగ్లో జరిగింది. ఈ ఏడాది జరగబోయే శిఖరాగ్ర సదస్సుకు సన్నాహకంగా దీన్ని చేపట్టారు. ఇందులో పాల్గొన్న భారత విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి.కె.సింగ్ మాట్లాడుతూ.. ఉగ్రవాదుల్లో మంచి, చెడు అనే ప్రశ్నే తలెత్తదని చెప్పారు. ప్రపంచశాంతికి ముప్పుగా మారిన నేరగాళ్లుగానే పరిగణించాలని కోరారు. వి.కె.సింగ్ వ్యాఖ్యలను చైనా విదేశాంగ మంత్రి వాంగ్ ఇ సమర్థించారు. ముష్కర ముఠాలపై పోరులో బ్రిక్స్ కూటమి దేశాలన్నీ ఏకతాటిపై ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.