న్యూఢిల్లీ, జనవరి 10 : స్టార్ రెజ్లర్లతో అట్టహాసంగా ప్రారంభమైన ప్రొ రెజ్లింగ్ లీగ్లో సాక్షి మాలిక్ నేతృత్వంలోని ముంబయి మహారథి జట్టు తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. మంగళవారం జరిగిన పోరులో ముంబయి 5-2తో ఢిల్లీ సుల్తాన్స్పై గెలుపొందింది. అయితే అంతకు ముందు టాస్ నెగ్గిన సాక్షి 74కేజీల విభాగాన్ని బ్లాక్ చేసింది. ఈ పోరులో ఢిల్లీ సుల్తాన్ తరఫున సుశీల్ కుమార్ బరిలోకి దిగాల్సి ఉంది. దీంతో సుశీల్ మ్యాచ్ లేకపోవడంతో ఒక్కసారిగా చాలా మంది అభిమానులు స్టేడియం నుండి వెళ్లిపోయారు. టాస్ ఓడిన సుశీల్ మహిళల 57 కేజీల విభాగాన్ని బ్లాక్ చేశాడు. దాంతో ఈ రెండు కేటగిరిలలో బౌట్లు జరగలేదు. ముంబై మహారథి తరఫున మహిళల విభాగంలో సీమా (50 కేజీలు), వెస్కాన్ సింథియా (76 కేజీలు), సాక్షి మాలిక్ (62 కేజీలు)... పురుషుల విభాగంలో సతిందర్ (125 కేజీలు), రమోనోవ్ (65 కేజీలు) విజయం సాధించారు. ఢిల్లీ తరఫున సందీప్ తోమర్ (57 కేజీలు), అస్లాన్ (92 కేజీలు) లు విజయం సాధించారు.