వాషింగ్టన్, జనవరి 10 : ఈ నెలాఖరులో స్విట్జర్లాండ్లోని దావోస్లో వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ జరగనుంది. ఈ సదస్సుకు ప్రపంచ దేశాల నుంచి ప్రముఖ నేతలు, ఆర్థిక వేత్తలు హాజరుకానున్నారు. అలాగే, భారత్ నుంచి ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేయనున్నారు. ఈ సదస్సు అనంతరం వీరు సమావేశం కానున్నట్లు అంతర్జాతీయ మీడియా సమాచారం. దాదాపు 11 ఏళ్ల తర్వాత ఓ భారత ప్రధాని దావోస్ సదస్సులో పాల్గొనడం జరుగుతుంది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ రెండు రోజులపాటు అక్కడ పర్యటించనున్నారు. కాగా, అమెరికా శ్వేతసౌధం మీడియా కార్యదర్శి సారా శాండర్స్ మీడియాతో మాట్లాడుతూ...అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన అమెరికా ఫస్ట్ ఎజెండాను ప్రపంచ నేతలతో పంచుకునేందుకు వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సరైన వేదిక అని ఆమె వెల్లడించారు. దాదాపు 18ఏళ్ల తర్వాత ఓ అమెరికా అధ్యక్షుడు ఈ సదస్సులో హాజరవుతున్నారు.