న్యూఢిల్లీ, జనవరి 10 : మహాత్మా గాంధీ సూచించిన అహింస సిద్ధాంతం ద్వారా ఉగ్రవాదం, అతివాదాన్ని ఎదుర్కోవచ్చని ప్రధాని మోదీ అన్నారు. పార్లమెంటేరియన్లుగా ఉన్న భారత సంతతి వ్యక్తులను ఉద్దేశించి ఏర్పాటు చేసిన తొలి సదస్సులో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. "భారత్ ఎప్పుడు నిర్మాణాత్మకమైన పాత్ర పోషిస్తోంది. లాభనష్టాలను అంచనా వేసుకొని ఒక దేశంపై మన విధానాన్ని నిర్ణయించే పద్ధతి మన వద్ద లేదు. మానవ విలువల కోణంలోనే వాటిని మనం చూస్తాం. ఇతర దేశాలకు తానిచ్చే అభివృద్ధి సాయానికి.. "ఇచ్చి-పుచ్చుకో" అనే సూత్రం ప్రాతిపదిక కాదు. ఆయా దేశాల్లో అవసరం, ప్రాధాన్యత ఆధారంగా ఇది సాగుతుంది" అని చెప్పారు. అలాగే ఎంతో విలువలు, సంప్రదాయాలు కలిగిన భారత్కు.. అస్థిరతను ఎదుర్కోనేలా ప్రపంచానికి మార్గనిర్దేశం చేసే శక్తి ఉందన్నారు. గత మూడు, నాలుగేళ్లలో భారత్పై ప్రపంచం దృష్టి నానాటికీ పెరుగుతోందని చెప్పారు. కాగా రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో 24 దేశాలకు చెందిన 134 మంది ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు.