బ్యాక్ టూ కెప్టెన్.. శ్రీలంక వన్డే సారథిగా మాథ్యూస్‌

SMTV Desk 2018-01-09 16:29:49  anjelo mathwes, srilanka, odi captain, srilanka cricket board

కొలంబో, జనవరి 9 : వరుస వైఫల్యాలతో సతమవుతున్న శ్రీలంక వన్డే జట్టు కెప్టెన్ గా ఏంజెలో మాథ్యూస్‌ మళ్లీ పగ్గాలు చేపట్టనున్నాడు. ఈ మేరకు మాథ్యూస్‌ను 2019 వన్డే వరల్డ్‌ కప్‌ వరకూ అతనికి నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తున్నట్లు శ్రీలంక క్రికెట్‌ బోర్డు(ఎస్‌ఎల్‌సీ) నిర్ణయించింది. గతేడాది జూలై నెలలో అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీ పదవికి గుడ్‌ బై చెప్పిన మాథ్యూస్‌ను తిరిగి వన్డే సారథి గా నియమిస్తున్నట్లు ఎస్‌ఎల్‌సీ ప్రకటించింది. ఈ విషయంపై మాథ్యూస్‌ స్పందిస్తూ.. " గతంలో నాయకత్వ బాధ్యతలు నుండి తప్పుకొని ఇక వాటి జోలికి పోకూడదని నిశ్చయించుకున్నాను. అయితే ఎస్‌ఎల్‌సీ, ప్రధాన కోచ్‌, శ్రీలంక సెలక్టర్లు నా నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలని అడిగారు. అందుకే మళ్లీ జట్టు పగ్గాలు చేపడుతున్నాను. వచ్చే ప్రపంచ కప్ 18 నెలలు కంటే తక్కువ సమయం మాత్రమే ఉంది. ఈ లోగా జట్టుని పటిష్టంగా తయారు చేయాల్సి ఉంది" అని వ్యాఖ్యానించారు.