సౌతాఫ్రికాపై ఘన విజయం సాధించిన టీమిండియా..

SMTV Desk 2018-01-09 15:53:41  U-19 2018, WARM UP, INDIA, SOUTH AFRICA, NEWZEALAND

క్రిస్ట్‌చర్చ్‌, జనవరి 9 : ఏంటి టైటిల్ చూసి ఆశ్చర్యపోతున్నారా..? సౌతాఫ్రికాతో జరిగిన టెస్ట్ లో కోహ్లీ సేన ఓడిపోయింది కదా..! మరేల అనుకుంటున్నారా..! నిజంగా టీమిండియా గెలిచింది. కాకపోతే మన యువసేన.. అదేనండి అండర్-19 వీరులు. న్యూజిలాండ్‌ వేదికగా అండర్‌-19 ప్రపంచకప్‌ పోటీలు ఈ నెల 13 నుంచి ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం దక్షిణాఫ్రికాతో నిర్వహించిన వార్మప్‌ మ్యాచ్‌లో భారత్‌ జయభేరి మోగించింది. ఒక పక్క సఫారీ గడ్డపై కోహ్లీ సేన పరాభవంతో పర్యటనను భారత్ అభిమానులకు నిరాశ మిగిల్చింది. మరో పక్క పృథ్వీ షా నాయకత్వంలోని టీమిండియా ప్రొటీస్ జట్టుపై విజయం సాధించి అభిమానులలో జోష్ నింపింది. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్‌ గెలిచిన భారత జట్టు బ్యాటింగ్‌ ఎంచుకుంది. టీమిండియా జట్టులో ఆర్యన్‌ జుయాల్‌(86), హిమాన్షు రాణా(68) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో భారత్‌ 8 వికెట్ల నష్టానికి 332 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా జట్టు భారత బౌలర్‌ ఇషాన్‌ పోరెల్‌ దెబ్బకు (నాలుగు వికెట్లు) 143 పరుగులకే కుప్పకూలిపోయింది. దీంతో టీమిండియా 189 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. జనవరి 13 నుంచి అండర్‌-19 ప్రపంచకప్‌ పోటీలు ప్రారంభంకానున్నాయి. జనవరి 14న భారత్‌ తన తొలి మ్యాచ్‌లో ఆసీస్‌ను ఢీకొననుంది. పృథ్వీ షా సారథ్యంలో భారత్ జట్టుపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.