సిడ్నీ, జనవరి 9 : ఆసీస్ క్రికెట్ జట్టు మాజీ సారథి రికీ పాంటింగ్ సేవలను ఆ దేశ టీ-20 జట్టు ఉపయోగించుకోనుంది. ఈ మేరకు అతన్ని టీ-20 జట్టుకు అసిస్టెంట్ కోచ్ గా ఎంపిక చేస్తున్నట్లు ఆస్ట్రేలియా బోర్డు తెలిపింది. ఈ విషయం పై పాంటింగ్ మాట్లాడుతూ..."గత సంవత్సరం జట్టుతో కలిసి పని చేసిన అనుభవం ఓ మధుర జ్ఞాపకం. ఇంగ్లాండ్-న్యూజిలాండ్తో సిరీస్ కోసం మరోసారి ఆసీస్ జట్టుతో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. టీ-20లో సత్తా చూపేందుకు మా దగ్గర చాలామంది ఆటగాళ్లు సిద్ధంగా ఉన్నారు" అని వ్యాఖ్యానించారు. గత రెండు ఐపీఎల్ సీజన్లలో ముంబయి ఇండియన్స్ కోచ్గా పనిచేసిన రికీ పాంటింగ్, ఈ ఏడాది నుంచి ఐపీఎల్లో దిల్లీ డేర్డెవిల్స్ కోచ్గా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. కాగా ఇంగ్లాండ్-ఆస్ట్రేలియా మధ్య ఆదివారం నుంచి ఐదు వన్డేల సిరీస్ ప్రారంభంకానుంది. ఫిబ్రవరిలో ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్-న్యూజిలాండ్ మధ్య ముక్కోణపు టీ -20 సిరీస్ జరగనుంది.