కేప్ టౌన్, జనవరి 9 : విరాట్ కోహ్లీ.. క్రికెట్ లో ఇతనొక బ్రాండ్.. తన ఆటతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. తాజాగా కేప్ టౌన్ లో సఫారీలతో జరిగిన టెస్టులో అతని ఆట చూడడానికి యూకే నుంచి జాన్-క్రిసియా దంపతులు కేప్టౌన్ వచ్చారు. ఈ దంపతులకు కేప్టౌన్ సిటీ, న్యూలాండ్స్ మైదానం అంటే చాలా ఇష్టం. అంతే కాదండోయ్ మన కెప్టెన్ కోహ్లీ ఆట అంటే ప్రాణం. అతని ఆటని చూడొచ్చని ఏకంగా 8,600మైళ్లు ధాటి కేప్ టౌన్ వచ్చారు. "ఔను.. మాకు కోహ్లీ అంటే చాలా ఇష్టం. అతని బ్యాటింగ్ శైలి అంటే ఇంకా ఇష్టం. అతనో గొప్ప ఆటగాడని మా ఇద్దరి అభిప్రాయం. అంతేకాదు కేప్టౌన్ టెస్టులో మంచి ప్రదర్శన చేస్తాడని భావిస్తాం. కానీ, దురదృష్టవశాత్తూ అతడు తొలి ఇన్నింగ్స్లో 5 పరుగులు మాత్రమే చేశాడు. మరో ఇన్నింగ్స్ ఉంది కదా అని వేచిఉన్నాం" అని జాన్ ఎంతో సంతోషంగా వ్యాఖ్యానించారు. అయితే రెండో ఇన్నింగ్స్ లో విరాట్ 28 పరుగులకే పెవిలియన్ చేరాడు. కానీ అతని సొగసైన ఆటను చూసే అదృష్టం వారికి దక్కింది. కాగా ఈ మ్యాచ్ లో భారత్ జట్టు సఫారీలపై 72 పరుగుల తేడాతో ఓటమి పాలైన విషయం తెలిసిందే.