న్యూఢిల్లీ, జనవరి 9 : "భారతీయులు ఎక్కడ ఉన్నా వారి సంతోషం కోసమే మేం పనిచేస్తున్నాం" అంటూ ప్రధాని మోదీ పేర్కొన్నారు. ప్రవాసీ భారతీయ దినోత్సవాన్ని పురస్కరించుకుని నేడు ఢిల్లీలో భారత సంతతి విదేశీ ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "భారత్కు స్వాగతం. భారతీయుల తరఫున మీకు నేను ఆహ్వానం పలుకుతున్నాను. మీలో ఉన్నత చదువులకై విదేశాలకు వెళ్ళిన వారు చాలా మందే ఉంటారు. ఒకవేళ అలా కాకపోయుంటే మీ కుటుంబం అక్కడ స్థిరపడటంతో మీరు అక్కడే పుట్టి ఉండొచ్చు. ఎలాగైతేనేం మీ మనసులో మీరు భారతీయులేనన్న భావన ఉంటుంది. భారతీయులు ఎక్కడ ఉన్నా వారి సంతోషం కోసమే మేం పనిచేస్తున్నాం" అంటూ వెల్లడించారు. అంతేకాకుండా విదేశాలలో ఉన్న భారతీయుల కోసం నిరంతరం పాటు పడుతున్న కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్పై ప్రశంసలు కురిపించారు. ఆపదలో ఉన్నామంటూ సుష్మాను సంప్రదించిన వారికి క్షణాల్లో సాయం అందిస్తున్న ఆమెకు అభినందనలు తెలిపారు. ప్రభుత్వం 21వ శతాబ్దపు అవసరాలను దృష్టిలో పెట్టుకుని సాంకేతికత, రవాణా రంగంలో పెట్టుబడులను పెంచుతోందని అన్నారు. అలాగే అవినీతిని రూపుమాపడమే మన ప్రధాన లక్ష్యంగా అందరు కృషి చేయాలన్నారు.