న్యూఢిల్లీ, జనవరి 9 : ప్రఖ్యాత జీవ శాస్త్రజ్ఞుడు, నోబెల్ పురస్కార గ్రహీత హర్ గోబింద్ ఖురానా జయంతి సందర్భంగా నేడు సెర్చ్ ఇంజిన్ గూగుల్ ఆయనకు నివాళులర్పించింది. లివర్ పూల్ విశ్వవిద్యాలయంలో పరిశోధనలు చేసిన ఈయన 1922 జనవరి 9న భారత్ లోని పంజాబ్ రాష్ట్రమునకు చెందిన రాయపూరు (ప్రస్తుతం పాకిస్థాన్లో ఉంది) అను గ్రామములో తల్లిదండ్రులు కృష్ణదేవి ఖురానా, గణపత్ రాయ్ లకు ఏదోవ సంతానంగా జన్మించారు. లాహోర్ నుంచి 1943 లో B.Sc అలాగే, 1945లో M.Sc పట్టాలు పొందిన ఖురానా మూడు సంవత్సరాలలోపు శాస్త్ర పరిశోధనలు చేసి, 1948లో Ph.D పట్టా పొందాడు. తదుపరి రెండు సంవత్సరములు స్విట్జర్లాండ్ లోని జ్యూరిచ్లో పరిశోధనలు సాగించారు. అనంతరం 1951-52లో విశ్వవిఖ్యాత కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయములో మాంసకృత్తులు, న్యూక్లిక్ ఆమ్లములకు సంధించిన పరిశోధన మొదలు పెట్టారు. జీవ నిర్మాణానికి దోహదం చేసే "కృత్రిమ జీన్"ను సృష్టించగలిగారు. ఈ ఆవిష్కరణ "జెనెటిక్ ఇంజనీరింగ్" అనే నూతన శాస్త్ర అధ్యయనానికి దారి తీసింది. ప్రతి అమీనో ఆమ్లపు నిర్మాణ క్రమము మూడు న్యూక్లియోటైడ్ల అమరికతో జన్యువులలో పొందుపరచి ఉన్నదని ఖొరానా కనుకొనడం జరిగింది. వరుసగా ఉన్న కృత్రిమ జీన్ (DNA) ముక్కను ప్రయోగశాలలో మొదటిసారిగా ఈయన సృష్టించారు. ఈ మేరకు వైద్య రంగంలో ఆయనకు 1968లో నోబెల్ బహుమతి అందించారు.