చెన్నై, జనవరి 8 : ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్)లో ఆదివారం జరిగిన మ్యాచ్ లో హైదరాబాద్ హంటర్స్ 6-(-1)తో అవధ్ వారియర్స్ పై ఘన విజయం సాధించింది. జరిగిన మ్యాచ్ లన్నిటిలోనూ హైదరాబాద్ గెలవడం విశేషం. మహిళా సింగిల్స్ ను ట్రంప్ మ్యాచ్ గా ఎనుకున్న హైదరాబాద్ తరపున ఒలింపిక్ చాంపియన్ కరోలినా మారిన్, సైనా నెహ్వాల్ను మట్టి కరిపించింది. అంతక ముందు అవధ్ వారియర్స్ ట్రంప్ మ్యాచైన పురుషుల సింగిల్స్లో సాయిప్రణీత్(హైదరాబాద్), అవధ్ షట్లర్ శ్రీకాంత్ను ఓడించాడు. మరో పురుషుల సింగిల్స్ లో లీ హ్యున్ (హైదరాబాద్), పారుపల్లి కశ్య్ప(అవధ్ )పై గెలుపొందాడు. పురుషుల డబుల్స్లో, మిక్స్డ్ డబుల్స్లోనూ హైదరాబాద్ విజయ కేతనం ఎగుర వేసి తిరుగులేని ఆధిపత్యం సాధించింది. ఈ మ్యాచ్ విజయాలతో హైదరాబాద్ హంటర్స్ జట్టు 14 పాయింట్లతో అగ్రస్థానం కొనసాగుతుంది. ఈ రోజు చెన్నై స్మషార్స్ జట్టు, బెంగుళూరు బ్లాస్టర్స్ తో తలపడనుంది.