విజయవాడ, జనవరి 07: ఎన్నికల ప్రచారంలో మత్స్యకారులను ఎస్టీల్లో చేరుస్తామని సీఎం చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారని, కానీ ఆ హామీ అమలుచేయాలని కోరితే.. తోలు తీస్తానంటూ బెదరించారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత మోపిదేవి వెంకటరమణ ఆగ్రహం వ్యక్తం చేశారు. మత్స్యకారులను ఉద్దేశించి చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేయడం దారుణమని వెంకటరమణ మండిపడ్డారు. మత్స్యకార సామాజిక వర్గానికి చంద్రబాబు బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఆయన కోరారు. మత్స్యకారులను ఎస్టీల్లో చేరుస్తూ వెంటనే అసెంబ్లీలో తీర్మానం చేయాలని మోపిదేవి డిమాండ్ చేశారు. ఆ తీర్మానానికి వైకాపా మద్దతిస్తుందని ఆయన తెలిపారు. "నేను సీఎంగా ఉండగా ఏ కులం వాళ్లూ రోడ్డెక్కే అవకాశం ఇవ్వలేదు. మీ ధర్నాలు, దీక్షలకు భయపడను. రాజకీయాలు చేస్తే సహించను. వెంటనే టెంట్లు ఎత్తేయండి. లేదంటే తోలుతీస్తా.. ఖబడ్దార్!" అంటూ సీఎం చంద్రబాబు మత్స్యకారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. మత్స్యకారులపై సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ఆ వర్గంలో తీవ్ర నిరసన వ్యక్తమవుతు౦ది.