రాజమహేంద్రవరం, జనవరి 7 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019 నాటికి తాగు నీటి సమస్య లేకుండా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఐటీశాఖ మంత్రి లోకేశ్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో ఉన్న లోకేశ్ కాకినాడ గ్రామీణం పండూరులో రూ. 15 కోట్లతో నూతనంగా నిర్మించిన రక్షణ మంచినీటి పథకాన్ని ప్రారంభించారు. అనంతరం పెద్దాపురానికి వెళ్లిన లోకేశ్ ఏపీఐఐసీ పారిశ్రామిక వాడలో 250 కోట్లతో నూతనంగా ఏర్పాటుచేసిన అపర్ణ వెటిరో సిరామిక్స్ పరిశ్రమను ప్రారంభించారు. తదుపరి పెద్దాపురం మండలం వాలుతిమ్మాపురంలో నూతనంగా నిర్మిస్తున్న పేదల గృహ సముదాయాలను మంత్రి పరిశీలించారు. ఆ తర్వాత జగ్గంపేట నియోజక వర్గంలో పర్యటించారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి చినరాజప్ప, ఎంపీ తోట నరసింహం, కలెక్టర్ కార్తికేయ మిశ్రా, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.