కేప్టౌన్, జనవరి 4: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్ట్లో టీమిండియా తొలి ఇన్నింగ్స్ 73.4 ఓవర్లకు 209 పరుగులకు ఆలౌటైంది. 77 పరుగుల లోటుతో ఆట ముగించింది. యువ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య (93) సూపర్ బ్యాటింగ్ తో ఆర్ధ సెంచరీ చేసి భారత్ జట్టును ఆదుకున్నాడు. ఒక వైపు పాండ్య శతకం చేసేలా కన్పించిన ఏడు పరుగుల దూరంలో తొమ్మిదో వికెట్గా పెవిలియన్ చేరాడు. దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ స్కోరు 286ను సాధించేందుకు సఫారీ బౌలర్లను ధాటిగా ఎదుర్కున్నాడు. పాండ్యకి తోడుగా భువనేశ్వర్ కుమార్ (25) చక్కటి ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరూ తొమ్మిదో వికెట్కు 99 పరుగుల భారీ భాగస్వామ్యం చేసి దక్షిణాఫ్రికా బౌలర్ల సహనాన్ని పరీక్షించారు. తేనీటి విరామం తర్వాత వీరిద్దరూ 8 పరుగుల తేడాతో వెంటవెంటనే ఔట్ కావడంతో పరుగుల వేగం తగ్గింది. చివరి వికెట్గా బుమ్రా (2) పెవిలియన్ చేరడంతో భారత్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. దక్షిణాఫ్రికా జట్టులో ఫిలాండర్, రబాడ మూడు వికెట్లు, స్టెయిన్, మోర్కెల్ చెరో రెండు వికెట్లు తీశారు. అంతకు ముందు భారత్ ఓవర్నైట్ స్కోరు 28/3తో ఆట మొదలుపెట్టింది. భారత్ బ్యాట్స్ మెన్ లలో పుజారా (26) పర్వాలేదనిపించాడు. దక్షిణాఫ్రికా తన తొలి ఇన్నింగ్స్లో 286 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.