రాంచీ, జనవరి 6 : పశు దాణా కేసులో నిందితుడిగా ఉన్న ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ శిక్షపై ఎట్టకేలకు తీర్పు వెలువడింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా లాలూ ప్రసాద్తో పాటు మరో 15 మంది దోషులు న్యాయమూర్తి ఎదుట హాజరయ్యారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏడుగురికి మూడున్నరేళ్ల జైలు శిక్షతో పాటు, ఐదు లక్షల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. జనవరి 3న శిక్ష ఖరారు చేయాల్సి ఉంది. కానీ ఓ న్యాయవాది మృతితో తీర్పును వాయిదా వేశారు. ఆ తర్వాత అనివార్య కారణాల వల్ల మరో రెండు సార్లు తీర్పు వాయిదా పడింది. ఎట్టకేలకు ఆయనకు మూడున్నరేళ్ల జైలు శిక్షను విధిస్తూ న్యాయస్థానం తీర్పు వెల్లడించింది.