న్యూఢిల్లీ, జనవరి 6 : పొరుగు దేశం పాకిస్తాన్ ఎప్పటి నుండో భారత్ తో ద్వైపాక్షిక సిరీస్ లు ఆడాలని బీసీసీఐ ని అడుగుతుంది. తమతో ద్వైపాక్షిక సిరీస్లు ఆడాలంటూ భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ) అడగడం మానుకోవాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)కు ఆ దేశ మాజీ కెప్టెన్ జావేద్ మియాందాద్ సూచించారు. తాజాగా ఇదే విషయంపై ఆయన మాట్లాడుతూ..” భారత్ తో క్రికెట్ ఆడకపోతే మన క్రికెట్ చచ్చిపోదు. మనతో ఆడేందుకు భారత్ కు ఇష్టం లేదు. అలాంటప్పుడు వారిని అర్జించడం అనవసరం. గత పదేళ్లుగా వారు మనతో ఎటువంటి ద్వైపాక్షిక సిరీస్ లలో పాల్గొనలేదు. ఆయినప్పటికి మన వాళ్లు ఛాంపియన్స్ ట్రోఫీ ని గెలిచారు. 2009 నుంచి సొంతగడ్డపై అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లు జరగకపోయినప్పటికీ మన జట్టు నిలదొక్కుకుంది” అని ఘాటుగా వ్యాఖ్యానించారు. సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘన, సీమాంతర ఉగ్రవాదానికి చరమగీతం పాడినప్పుడే పాక్తో క్రికెట్ ఆడుతామని ఇటీవల భారత విదేశాంగశాఖ మంత్రి సుష్మాస్వరాజ్ ఖరాఖండిగా చెప్పిన విషయం తెలిసిందే.