కర్నూలు, జనవరి 06: కర్నూలు స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల స్వీపర్పై ప్రిన్సిపాల్ పీవీ హరిబాబు చేయి చేసుకున్నారు. ఈ మేరకు బాధితురాలు టు టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కళాశాలలో 1994 నుంచి స్వీపర్గా మాదం శెట్టి చిన్న వెంకమ్మ విధులు నిర్వహిస్తున్నారు. కళాశాలలో వేసిన లైట్లు ఎందుకు ఆర్పలేదని ప్రిన్సిపాల్ చేయి చేసుకున్నట్లు ఆమె తెలిపారు. కళాశాల నుంచి వెళ్లిపోకపోతే ఉద్యోగం నుంచి తీసివేస్తానని బెదిరించినట్లు ఆమె వాపోయారు. అయితే వెంకమ్మ తమకు మౌఖికంగా ఫిర్యాదు చేశారని, లిఖిత పూర్వకంగా చేస్తే కేసు నమోదు చేస్తామని ఎస్ఐ ఓబులేసు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా కేసు పెట్టకుండా కొందరు వ్యక్తులు రాజీ కుదిర్చే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.