కేప్ టౌన్, జనవరి 5 : దక్షిణాఫ్రికా తో జరుగుతున్న తొలి టెస్ట్ లో సఫారీ జట్టు తొలి ఇన్నింగ్స్ లో 73.1 ఓవర్లలో 286 పరుగులకే ఆలౌటైంది. టీమిండియా బౌలర్లు విజృంభించడంతో తొలి రోజు పూర్తిగా ఆడకుండానే దక్షిణాఫ్రికా జట్టు కుప్పకూలిపోయింది. పేసర్లకు స్వర్గధామంగా భావించే పిచ్పై పరిస్థితులను సద్వినియోగం చేసుకుని తొలిరోజే కోహ్లీ సేన సఫారీలకు షాకిచ్చింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ప్రత్యర్ధి జట్టుకు ఆరంభంలోనే భువనేశ్వర్ షాకిచ్చాడు. ఎల్గర్(0) మార్క్ రమ్ (5) హషీం అమ్లా(3), ను భువి తన ఖాతాలో వేసుకున్నాడు. తర్వాత వచ్చిన ఏబీ డివిలియర్స్(65), డుప్లెసిస్(62)లు హాఫ్ సెంచరీలు చేయగా, డీ కాక్(43), కేశవ్ మహరాజ్(35), ఫిలాండర్(23) కాసేపు పరుగుల వరద పారించారు. చివరిలో రబాడ(26), మోర్కెల్(2)ను అశ్విన్ ఔట్ చేశాడు. భారత్ బౌలర్లలో భువనేశ్వర్ నాలుగు వికెట్లు, అశ్విన్ రెండు, షమీ, పాండ్య, బుమ్రా ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.