త్వరలో కానిస్టేబుల్ పోస్టుల భర్తీ

SMTV Desk 2017-06-20 14:25:40  Constable posts replacement, Technology,10 thousand posts, Greyhounds, Octopus, CID, Intelligence, ISW, PTC

హైదరాబాద్, జూన్ 20 : తెలంగాణ రాష్ట్రంలో రానున్న రోజుల్లో భారీగా పోలీసు శాఖలో నియామకాలకు రంగం సిద్దమవ్వడంతో, రాష్ట్ర విభజన తర్వాత ఏర్పడిన లోటు, జిల్లాల పునర్విభజన నేపథ్యంలో అవసరమైన కొత్త పోస్టులు, టెక్నాలజీకి తగినట్లుగా కావాల్సిన సిబ్బందిని నియమించుకునేందుకు కసరత్తు మొదలైంది. రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించిన 26,290 పోస్టుల్లో తొలిదశగా దాదాపు 10 వేల పోస్టుల్లో నియామకాలు జరిపేందుకు ప్రక్రియ ప్రారంభిస్తున్నారు. తెలంగాణ ఏర్పాటయ్యాక జరిగిన నియామకాల్లో పోలీసు శాఖదే సింహభాగం. ప్రభుత్వం 2015లో 10 వేలకు పైగా కానిస్టేబుల్, ఫైర్‌మన్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ ఇవ్వగా.. ఫిబ్రవరిలో తుది పరీక్ష ఫలితాలు ప్రకటించి, ఎంపికైనవారిని నెలన్నర క్రితం శిక్షణకు సైతం పంపించారు. తాజాగా మంత్రివర్గం ఆమోదించిన పోస్టుల్లో.. 10 వేల కానిస్టేబుల్‌ పోస్టులు భర్తీ చేయాలని పోలీసు ఉన్నతాధికారులు నిర్ణయించారు. సివిల్, ఏఆర్, బెటాలియన్, స్పెషల్‌ పోలీస్, కమ్యూనికేషన్‌ తదితర విభాగాల్లో ఈ నియామకాల కోసం ఏర్పాట్లు చేయాలని సూత్రప్రాయంగా ఆదేశాలు వెళ్లినట్టు తెలుస్తోంది. ప్రతి పోలీస్‌స్టేషన్‌కు ఇద్దరు ఏఆర్‌ కానిస్టేబుళ్లను డ్రైవర్లుగా పంపించాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. కోట్ల రూపాయలు వెచ్చించి నూతనంగా కొనుగోలు చేసిన అత్యాధునిక వాహనాల భద్రత నిమిత్తం వారిని రోజుకొకరి చొప్పున ఉపయోగించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక కొత్త జిల్లాలు ఏర్పాటైనప్పుడు పాత జిల్లాల నుంచే కొంత మంది సిబ్బందిని విభజించి వాటికి ఏఆర్‌ హెడ్‌క్వార్టర్స్‌ను ఏర్పాటు చేశారు. దానివల్ల సిబ్బంది కొరత ఏర్పడడంతో ఏఆర్‌ బలగాలను పెంచాలని నిర్ణయించారు. రాష్ట్ర విభజన తర్వాత గ్రేహౌండ్స్, ఆక్టోపస్, సీఐడీ, ఇంటెలిజెన్స్, ఐఎస్‌డబ్ల్యూ, పీటీసీ, కమ్యూనికేషన్స్, ఏసీబీ... తదితర విభాగాల్లో సిబ్బంది కొరత ఏర్పడటంతో ఆ విభాగాలను పటిష్టం చేయాలంటే సిబ్బందిని పెంచాల్సి ఉందన్నారు. ఈ నేపథ్యంలోనే కొత్తగా భర్తీ చేయనున్న పోస్టుల్లో దాదాపు సగం వరకు సివిల్, బెటాలియన్లకు కేటాయించనున్నారు. కమ్యూనికేషన్‌ తదితర విభాగాల్లో మిగతా పోస్టులను భర్తీ చేయనున్నారు. కేబినెట్‌ ఆమోదించిన పోస్టుల్లో మొదటి దఫా నియామకాలపై ప్రభుత్వ ఆదేశాల కోసం వేచిచేస్తున్నామని సీనియర్‌ ఐపీఎస్‌ తెలిపారు. జీఏడీ నుంచి కొత్త పోస్టుల ఆమోదానికి సంబంధించి ఆదేశాలు వచ్చాక.. ఆర్థిక నుంచి అనుమతి రావల్సి ఉంటుందని.. ఇందుకు కనీసం 20 రోజులు పడుతుందని తెలిపారు. తర్వాత తమ కార్యచరణ ఉంటుందని, ఆగస్టు మొదటి లేదా రెండో వారానికి కల్లా నోటిఫికేషన్‌ విడుదల చేసే అవకాశం ఉందని వారు వెల్లడించారు.