ప్యాంగ్యాంగ్, జనవరి 5 : గత రెండేళ్లుగా ఉత్తర కొరియా, దక్షిణ కొరియా దేశాలు యుద్దవతావరణాన్ని సృష్టించిన విషయం తెలిసిందే. ఎప్పుడూ చూసిన మాటల తూటాలు, కవ్వింపు చర్యలతో ఎడమొహం, పెడమొహంగా ఉండే ఇరు దేశాలు ఈ నెల 9న భేటీ కానున్నాయి. దాదాపు రెండేళ్ల తరువాత ఇరు దేశాల ప్రతినిధులు సమావేశం కాబోతున్నారు. చర్చల కోసం సియోల్ పంపిన అభ్యర్థనకు ప్యాంగ్యాంగ్ అంగీకారం తెలపడంతో ఈ సమావేశాలకు మార్గం సుగమమైంది. సరిహద్దు ప్రాంతంలోని పెన్ముంజోమ్ గ్రామంలో ఇరు దేశాల ప్రతినిధులు సమావేశమై ప్యాంగ్చాంగ్ వింటర్ ఒలింపిక్స్ నిర్వహణపై చర్చించనున్నట్లు సమాచారం. అలాగే ఇరు దేశాల సంబంధాలపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. అమెరికా, దక్షిణ కొరియా నిర్వహించే సంయుక్త సైనిక విన్యాసాలు వాయిదా పడిన కొన్ని గంటల్లోనే ఈ సమావేశం ఖరారు కావడం గమనార్హం.