ఎందుకు ఆపేశారు.. కొనసాగించండి : నితీశ్‌ కుమార్‌

SMTV Desk 2018-01-05 14:12:27  bhihar cm, nithish kumar, sahasra tour, speech,

పట్నా, జనవరి 5 : ఆ నల్ల జెండాలను ఎందుకు దాచి పెట్టారు.? నిరసనను కొనసాగించండి అంటూ బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ అన్నారు. సహస్ర ప్రాంతంలోని సులిందాబాద్‌లో పర్యటించిన నితీశ్.. అక్కడ ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. ఆయన మాట్లాడుతున్న క్రమంలో కొంత మంది యువకులు నల్ల జెండాలు పట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. ఇది గమనించిన పోలీసులు వారిని అడ్డుకునే౦దుకు ప్రయత్నించగా నితీశ్ వారిని అడ్డుకొని పై విధంగా స్పందించారు. "నలుపు రంగులో తప్పేముంది.? అది కూడా మంచి రంగే కదా.! అది ప్రజాస్వామ్యానికి అందం తీసుకొస్తుంది. మనం అసమ్మతిని కూడా అంగీకరించాలి. అక్కడ ఆ యువకులు నలుగురు మాత్రమే ఉన్నారు. మీరు అక్కడికి వెళ్లి అడ్డుకుంటే మొత్తం మీడియా దృష్టిని ఆకర్షి౦చి వారికి అనవసరంగా ప్రచారం మనమే కల్పించినట్లవుతుంది" అన్నారు. ఈ ఘటనతో ఒక్కసారిగా ఆ యువకులు నిరసనను ఆపేశారు. ఆ వెంటనే నితీశ్‌ మళ్ళీ.. "ఎందుకు మీ నిరసనను ఆపేశారు.? మీ జెండాలను ఎందుకు దాచిపెడుతున్నారు. కొనసాగించండి" అంటూ చమత్కరించారు.