ముంబై, జనవరి 5 : ఐపీఎల్ -11 సీజన్ కోసం అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అంతే కాకుండా ఈ సారి ధనా ధన్ ధోని టీం చెన్నై సూపర్ కింగ్స్ , రాజస్థాన్ రాయల్స్ జట్టు బరిలోకి దిగనున్నాయి. ఇంకా ఈ టోర్నీకి చాలా సమయం ఉంది. కాగా ఇప్పటి నుండే మన పరుగుల వీరుడు, కోహ్లి రికార్డు సృష్టించాడు. నిన్న జరిగిన రిటైన్ పద్ధతిలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కింగ్ కోహ్లీని తిరిగి దక్కించుకుంది . గరిష్ఠంగా రూ.17 కోట్లు చెల్లించి ఆర్సీబీ అట్టి పెట్టుకునే విధానంలో తిరిగి సొంతం చేసుకుంది. అయితే ఇంతకముందు సిక్సర్ల వీరుడు యువరాజ్ సింగ్ ను 2015లో దిల్లీ డేర్డెవిల్స్ అత్యధికంగా రూ.16 కోట్లకు వేలంలో పాడుకుంది. గతేడాది సీజన్ కోసం నిర్వహించిన వేలంలో ఇంగ్లాండ్ ఆల్రౌండర్ బెన్స్టోక్స్ ను పూణే సూపర్ జేయంట్స్ రూ.14.5కోట్లు చెల్లించిన సంగతి తెలిసిందే. 10ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఇప్పటి వరకు ఏ ఒక్క ఆటగాడికి ఫ్రాంఛైజీలు ఇంత మొత్తాన్ని చెల్లించలేదు. ఐపీఎల్ -2018కి గానూ అట్టి పెట్టుకునే విధానంలో అత్యధిక మొత్తాన్ని దక్కించుకున్న టాప్-5 ఆటగాళ్లు జాబితా.. 1. విరాట్ కోహ్లీ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు - రూ.17 కోట్లు) 2. మహేంద్ర సింగ్ ధోనీ (చెన్నై సూపర్ కింగ్స్ - రూ.15 కోట్లు) 3. రోహిత్ శర్మ (ముంబయి ఇండియన్స్: రూ.15 కోట్లు) 4. స్టీవ్ స్మిత్ (రాజస్థాన్ రాయల్స్ - రూ.12 కోట్లు) 5. డేవిడ్ వార్నర్ (సన్రైజర్స్ హైదరాబాద్ - రూ.12 కోట్లు)