ముంబై, జనవరి 5 : ఐపీఎల్-11 కోసం ఇప్పటికే తమ ఫ్రాంచైజీ లు రిటైయన్ చేసుకున్న ఆటగాళ్ల జాబితాను ప్రకటించారు. వచ్చే నెల ఏప్రిల్ నుండి ప్రారంభమయ్యే ఈ టోర్నీ కోసం యాజమాన్యాలు తమ కోచ్ ల స్థానాలలో కొన్ని మార్పులు చేస్తున్నాయి. తాజాగా ఢిల్లీ డేర్ డెవిల్స్ (డీడీఆర్) జట్టుకు ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు, రికీ పాంటింగ్ ప్రధాన కోచ్గా నియమితుడయ్యాడు. డీడీఆర్ కు కోచ్ గా ఉన్న రాహుల్ ద్రవిడ్ పరస్పర విరుద్ధ ప్రయోజనాల అంశం కారణంగా వైదొలిగాడు. అతని స్థానంలో పాంటింగ్ ను ఎంపిక చేస్తున్నట్లు ఆ జట్టు సీఈవో హేమంత్ దువా తెలిపారు. మరో వైపు కోహ్లీ నేతృత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ జట్టుకు బ్యాటింగ్ కోచ్, మెంటర్ గా గ్యారీ కిర్స్టన్ వ్యవహరించనున్నారు. గతంలో భారత్ జట్టుకు కోచ్గా వ్యవహరించిన గ్యారీ మూడు ఐపీఎల్ సీజన్లలో ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టుకు కోచ్గా కొనసాగారు.భారత్ మాజీ ఆటగాడు ఆశిష్ నెహ్రా ఆర్సీబీకి బౌలింగ్ కోచ్ గా సేవలందించనున్నాడు.