హైదరాబాద్, జూన్ 20 : గురుకులాల్లో ఉపాధ్యాయ, వివిధ నియామకాల భర్తీకి నిర్వహించనున్న మెయిన్ పరీక్షల తేదీల్లో టీఎస్పీఎస్సీ మార్పులు చేశారు. పాత షెడ్యూల్ స్థానంలో సవరణ చేసిన కొత్త షెడ్యూల్ను సోమవారం విడుదల చేసింది. పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీ టీ), ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ) పరీక్షలు ఈ నెల 29, 30, వచ్చే నెల 4, 5, 6 తేదీల్లో నిర్వహించాల్సిఉండగా వచ్చే నెల 18 నుంచి నిర్వహించనున్నట్లు ప్రకటించారు. గత నెల 31న నిర్వహించిన స్క్రీనింగ్ టెస్టు ఫైనల్ కీలను ఇటీవల ప్రకటించి మెయిన్ పరీక్ష తేదీలను కూడా ప్రకటించటంతో, గురుకుల స్ర్కీనింగ్ టెస్టు పరీక్షల ఫలితాలు వెల్లడించిన నాటి నుంచి మెయిన్స్ పరీక్ష నిర్వహణకు రెండు నెలల గడువు ఇవ్వాలని తెలంగాణ నిరుద్యోగ జేఏసీ డిమాండ్ చేసారు. దీంతో మరో 15 రోజులు గడువు ఇవ్వాలని కమిషన్ నిర్ణయించారు. పీజీటీ మెయిన్ పరీక్షలను వచ్చే నెల 18, 19 తేదీల్లో, టీజీటీ మెయిన్ పరీక్షలను 20 నుంచి 22 వరకు, పీడీ మెయిన్ పరీక్షలను వచ్చే నెల 18న నిర్వహిస్తామని ప్రకటించింది. ఉదయం 10 గంటల నుంచి 12.30 గంటల వరకు పేపర్–1 పరీక్షలు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపరు–2 పరీక్షలు ఉంటాయని, ఫిజికల్ డైరెక్టర్ పోస్టుకు పేపరు–1 ఒకటే ఉంటుందని, ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఉంటుందన్నారు.