న్యూఢిల్లీ, జనవరి 4 : భారత నేవీ మాజీ అధికారి కుల్భూషణ్ జాదవ్కు సంబంధించి మరో వీడియోను పాకిస్థాన్ అధికారులు విడుదల చేశారు. ఇటీవల జాదవ్ ను గూఢచర్యం ఆరోపణలు చేస్తూ పాకిస్తాన్ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన మాట్లాడుతున్న వీడియోలో "నన్ను చూడగానే నా తల్లి కళ్లలో భయం కనిపించింది. ఆమె ఏడుస్తుంటే ఆ సమయంలో భారత రాయబారి గట్టిగా అరిచారు. ఆయన ఆమెను అరవడం నేను చూశాను. దీని వల్ల నా తల్లి సంతోషంగా ఉంది. నేను సంతోషంగా ఉన్నాను. అమ్మా.. నా గురించి ఆందోళన పడొద్దు. వాళ్లు(పాక్ అధికారులు) నన్ను బాగానే చూసుకుంటున్నారు. నన్ను ఎటువంటి హింసలకు గురి చేయలేదు. భారత నేవీలో నా ఉద్యోగం పోలేదు. నేను ఇంకా భారత నేవీ అధికారినే" అంటూ పేర్కొన్నారు. మొన్నామధ్య జాదవ్ను ఆయన తల్లి, భార్య కలుసుకునేందుకు పాక్ అధికారులు ఏర్పాటు చేశారు. ఆ విషయాలను కూడా తెలుపుతూ.. పాక్ అధికారులకు జాదవ్ కృతజ్ఞతలు చెబుతున్నట్లు ఓ వీడియోను రూపొందించి విడుదల చేశారు. ఇదిలా ఉండగా జాదవ్ను కలుసుకునే సమయంలో ఆయన తల్లి, భార్య మెడలోని మంగళసూత్రాలు, బొట్టు, గాజులు, చెప్పులు తీయించడం తీవ్ర వివాదాస్పదమైంది. ఈ విషయంపై భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ తీవ్రంగా ఖండించారు. కొంచం కూడా మానవత్వం ప్రదర్శించకుండా ఇలా అమానుషంగా ప్రవర్తించడం పట్ల తీవ్ర స్థాయిలో ఆగ్రహ౦ వ్యక్తం చేశారు.