న్యూఢిల్లీ, జనవరి 4 : కెన్యాలోని మోంబసా ప్రాంతంలో చిక్కుకున్న ముగ్గరు భారత బాలికలను కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ రక్షించారు. ఈ నేపథ్యంలో మంత్రి సుష్మా స్వరాజ్ ట్విటర్ ద్వారా జరిగిన విషయాన్ని వివరించారు. ఆమె తెలిపిన వివరాల ప్రకారం...పంజాబ్ కు చెందిన బాధిత బాలికలు ఏజెంట్ల చేతిలో మోసపోయి అక్రమ రవాణా చేయడం జరిగింది. అంతేకాకుండా వారి వద్ద ఉన్న ఫోన్లను, పాస్పోర్టులను లాక్కుని బందీలుగా మార్చారు. వీరితో పాటు నేపాల్కు చెందిన మరో ఏడుగురు బాలికలను కూడా కాపాడినట్లు చెప్పారు. ఈ మేరకు బాలికలను రక్షించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేసిన కెన్యాలోని భారత హై కమిషనర్ సుచిత్రా దురయ్, సెక్రటరీ కరణ్ యాదవ్ను ఆమె అభినందించారు. అలాగే, కెన్యా పోలీసులకు కూడా కృతజ్ఞతలు తెలిపినట్లు సుష్మా ట్విట్టర్ లో వెల్లడించారు.