న్యూఢిల్లీ, జనవరి 3 : ముస్లిం మహిళల సంరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన ‘ట్రిపుల్ తలాక్’ బిల్లు ఈ రోజు రాజ్యసభలో కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ప్రవేశపెట్టారు. లోక్ సభలో బిల్లు పై ప్రతిపక్ష కాంగ్రెస్ వ్యతిరేకించినప్పటికీ మూజువాణి ఓటుతో ఈ బిల్లు ఆమోదం పొందిన విషయం తెలిసిందే. కానీ ఈ రోజు బిల్లు పెద్దల సభలోకి రాగానే అధికార, విపక్షాల మధ్య పార్లమెంటులో ఆందోళన పర్వం కొనసాగింది. దీంతో డిప్యూటీ చైర్మన్ పీ.జె కురియన్ సభను రేపటికి వాయిదా వేశారు. ట్రిపుల్ తలాక్ బిల్లుకు తాము వ్యతిరేకం కాదని కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ స్పష్టంచేశాయి. కానీ ఈ బిల్లును మరింత బలోపేతం చేసేందుకే సెలెక్ట్ కమిటీకి పంపాలని డిమాండ్ చేస్తున్నట్టు నేతలు వెల్లడించారు. మహిళల హక్కుల కోసం కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కట్టుబడి ఉందని ఆ పార్టీ నేత ఆనంద్ శర్మ తెలిపారు.