కేప్ టౌన్, జనవరి 3 : టీమిండియా జట్టుతో తొలి టెస్ట్ పోరుకు సిద్ధమవుతున్న ఆతిధ్య జట్టుకు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. ఏడాది విరామం తర్వాత జట్టులో స్థానం సంపాదించుకున్న సఫారీ పేస్ ఎక్స్ ప్రెస్ డేల్ స్టెయిన్ మొదటి టెస్ట్ లో ఆడకపోవచ్చునని ఆ జట్టు కోచ్ ఓటిస్ గిబ్సన్ సూచనప్రాయంగా తెలిపారు. గాయం నుండి కోలుకున్న స్టెయిన్ టీమిండియా టెస్ట్ సిరీస్ కోసం దక్షిణాఫ్రికా జట్టులో చోటు దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ విషయం పై గిబ్సన్ మాట్లాడుతూ.."స్టెయిన్ ఏడాదిగా ఆటకు దూరంగా ఉన్నాడు. ముగ్గురు సభ్యుల పేస్ విభాగంలో స్టెయిన్ను తీసుకుని, అతడు గాయంతో మ్యాచ్ మొత్తం ఆడలేకపోతే జట్టు పరిస్థితేంటి? నా ఉద్దేశం అతడు మ్యాచ్ను పూర్తి చేయలేడని కాదు. కానీ సిరీస్ తొలి మ్యాచ్లో సాహసం చేయలేం’’ అని వ్యాఖ్యానించారు.