కరాచీ, జనవరి 2 :భారత్ లో వచ్చే ఏప్రిల్-4 నుండి మే-31న జరిగే ఐపీఎల్-11 కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రపంచ క్రికెట్ లో రారాజుగా వెలుగొందుతున్న ఈ టోర్నీ క్రేజ్ కోసం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎంతో మంది దేశ ఆటగాళ్లును అక్కున చేర్చుకున్న ఈ మెగా లీగ్ లో దాయాది దేశం పాకిస్తాన్ ఆటగాళ్లుకు మాత్రం చోటు లేదు. పాకిస్తాన్ లో ఐపీఎల్ మాదిరి పీఎస్ఎల్ (పాకిస్తాన్ సూపర్ లీగ్) రెండు సీజన్లు ముగించుకుని ఈ ఏడాది మూడో సీజన్కు రంగం సిద్దం చేసుకుంటుంది. ఈ ఏడాది పీఎస్ఎల్-3వ సీజన్ ఫిబ్రవరి 22 నుంచి మార్చి 25 వరకు జరగనుంది. ఈ నేపథ్యంలో పాక్ మాజీ ఆటగాడు అబ్దుల్ రజాక్ మాట్లాడుతూ..” నా వరకు ఐపీఎల్ టోర్నీ కంటే పీఎస్ఎల్ టోర్నీ ఎంతో నాణ్యమైనది. అంతర్జాతీయ క్రికెటర్లతో కలిసి ఆడాలనుకున్న వారికి పీఎస్ఎల్ చాలా మంచి వేదిక. పీఎస్ఎల్లో ఆడాలని నాకూ ఉంది. నా ఫిట్నెస్ను బాగా మెరుగుపరుచుకుని వచ్చే ఏడాది పీఎస్ఎల్లో తప్పకుండా ఆడుతా” అని వ్యాఖ్యానించారు.