ముజఫర్నగర్, జనవరి 2 : ఒక వైపు మోదీ తన చాతుర్యంతో దేశంలోని అందరి వర్గాల అభిమానాన్ని చూరగొని పార్టీని బలోపేతం చేస్తుంటే, మరో వైపు ఆ పార్టీ నేతలు బీజెపీ ప్రతిష్టను మసకబారే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇటీవల బీజెపీ ఎంపీ అనంత్ కుమార్ హెగ్డే ‘లౌకిక వాదం’పై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా ఉత్తర్ప్రదేశ్ కౌతాలికి చెందిన భాజపా ఎమ్మెల్యే విక్రమ్ సైనీ మరో సారి అటువంటి మాటలతో వివాదంలో నిలిచారు. ముజఫర్నగర్లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ..” ఈ దేశం హిందూస్థాన్. అంటే హిందువుల దేశం. నేను హిందుత్వం పట్ల విపరీతమైన నమ్మకం ఉన్నవాడిని. గత ప్రభుత్వం (సమాజ్ వాదీ పార్టీ ) ముస్లింలకే పెద్దపీట వేసింది” అని వ్యాఖ్యానించారు. గతంలోనూ సైనీ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. 2013 ముజఫర్ నగర్ అల్లర్ల కేసులో జాతీయ భద్రతా చట్టం కింద పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేశారు.