బెంగళూరు, జనవరి 02 : ఆడపిల్లలే బరువు అనుకుంటున్న ఈ సమాజంలో పురుషులతో సమానంగా రానించాలన్న ఉద్ధేశంతో, ఆడపిల్లలను పోత్సహించేందుకు బీబీఎంపీ (బృహత్ బెంగళూరు మహానగర పాలిక)ఓ కొత్త ప్రతిపాదనను ప్రవేశపెట్టింది. బెంగళూరులోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో డిసెంబర్ 31న అర్ధరాత్రి 12 గంటలు దాటిన తర్వాత పుట్టిన ప్రతి ఆడపిల్లకు డిగ్రీ వరకూ ఉచితంగా చదువు చెప్పించనున్నట్లు బీబీఎంపీ తెలిపింది. అన్నట్టుగానే అర్ధరాత్రి 12 గంటలు దాటిన తర్వాత 5 నిమిషాలకు (జనవరి 1న తెల్లవారుజామున 00:05) బెంగళూరుకు చెందిన పుష్ప, గోపి దంపతులకు జన్మించిన ఆ బాలికకు దక్కింది. ఆడపిల్లల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని, ఇలాంటి అవకాశాన్ని కల్పించిన బీబీఎంపీకి గోపి దంపతులు ధన్యవాదాలు తెలిపారు. ఆడపిల్లలు భారం అనుకునేవారికి ఈ ప్రతిపాదన ఓ కనువిప్పు కావాలి. అందుకే జనవరి 1న ప్రభుత్వ ఆస్పత్రుల్లో సాధారణ కాన్పు ద్వారా పుట్టిన ఆడపిల్లలకు డిగ్రీ వరకు ఉచితంగా చదువు చెప్పించాలని నిర్ణయించామని, బెంగళూరు నగర మేయర్ ఆర్.సంపత్ రాజ్ వెల్లడించారు.