హైదరాబాద్, జనవరి 1 : కథానాయిక ప్రాధాన్యం ఉన్న చిత్రాలలో తనదైన నటనలో ఒదిగిపోయే కథానాయిక నయనతార. ఆమె తమిళంలో "డోరా", "అరం", "వెలైకారణ్" వంటి చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇవి మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్ళనే రాబట్టాయి. ఈ నేపథ్యంలో నయన్ తన ట్విటర్లో అభిమానులను ఉద్దిశి౦చి ఓ భావోద్వేగపు ట్వీట్ చేశారు. "నాపై ఇంతటి అభిమానం చూపించిన అభిమానులకు ధన్యవాదాలు. మీ ఆశీర్వాదాలు ఎప్పుడు నాకు ఉన్నాయి. మీరు చూపించే ప్రేమ, ఆప్యాయత జీవితం ఎంత అందమైనదో తెలిపాయి. అందుకు మీ కోసం నేను చేయగలిగేది ఒక్కటే. వినోదాత్మక సినిమాల్లో మాత్రమే కాకుండా "అరం" లాంటి సినిమాలను కూడా చేస్తూ మరింత కష్టపడతాను. ఈ నూతన సంవత్సరంలో మీరు కోరుకున్నవన్ని దక్కాలని ఆశిస్తున్నా. ప్రేమ, పాజిటివిటీతో 2017 ఏడాది గడిచింది. ఇద౦తా మీ వల్లే సాధ్యమైంది. అందుకు మీకందరికీ ధన్యవాదాలు. అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం నయన్ బాలకృష్ణతో కలిసి "జై సింహా" అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.