న్యూఢిల్లీ, జనవరి 1 : టీమిండియా క్రికెట్ సారధి కోహ్లీపై దక్షిణాఫ్రికా మాజీ ఆల్రౌండర్ కలీస్ పై ప్రశంసల వర్షం కురిపించాడు. మరో నాలుగు రోజుల్లో భారత్-దక్షిణాఫ్రికా మధ్య మూడు టెస్టుల సిరీస్ లో భాగంగా తొలి టెస్ట్ ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా కలీస్ మాట్లాడుతూ.." ప్రస్తుత భారత జట్టు బౌలింగ్ చాలా బలంగా ఉంది. ఇక్కడి పిచ్ లు సీమర్లకు బాగా అనుకూలిస్తాయి. ఇరు జట్లు మంచి ఫాం ఉండటం వల్లే అందరి చూపు ఈ సిరీస్పై పడింది. కోహ్లీ చాలా ఉత్తమమైన ఆటగాడు. రాయల్ ఛాలెంజర్స్ తరఫున కలిసి ఆడే సమయంలోనే అతడి ప్రతిభను గుర్తించా. కోహ్లీ ఇదే ఫామ్ను కొనసాగిస్తే ఎన్నో రికార్డులను అధిగమిస్తాడు. ఏదైనా సాధించే సత్తా అతనిలో ఉంది. అతని ఎలాంటి ఆటగాడో రికార్డులు చెప్తున్నాయి" అని వ్యాఖ్యానించారు. ఐపీఎల్లో కలీస్ కోల్కతా నైట్రైడర్స్కు కోచ్గా బాధ్యతలు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా నైట్రైడర్స్ నుంచి ఆ జట్టు సారథి గౌతమ్ గంభీర్ బయటికి వచ్చేస్తున్నాడన్న వార్తలపై స్పందిస్తూ.. ‘ఈ వార్తలు నా వరకు రాలేదు. ఏదైనా వేలం జరిగే వరకు వేచి చూడాలి. అప్పుడు ఏ ఆటగాడు ఏ జట్టు తరఫున ఆడతాడో స్పష్టత వస్తుంది కదా’ అని కలీస్ తెలిపారు.